28, ఆగస్టు 2015, శుక్రవారం

రక్షాబంధనం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి?



రక్షాబంధనం
తెలుగువారికి విశేష ఆదరమైన “ధర్మసింధు” నందు ఇలా ఉంది.
శ్రావణ పూర్ణిమ యందు రక్షాబంధనము చేయవలెను. సూర్యోదయము మొదలు ఆరుఘడియలు (1ఘ = 24ని.లు) కంటే ఎక్కువగా వ్యాపించి ఉన్న రోజున అపరాహ్ణ సమయ మందు గానీ, ప్రదోష సమయమందు గానీ భద్ర కరణం లేని సమయమున చేయవలెను. ఒకవేళ సూర్యోదయము తరువాత పూర్ణిమా తిథి మూడు ముహూర్తముల (1 ముహూర్తము=2 ఘడియలు = 48ని.లు) కంటే తక్కువయైనచో ముందురోజు భద్ర కరణం లేని ప్రదోష సమయంలో చేయవలెను. గ్రహణము, సంక్రాంతి దోషములు ఈ రక్షాబంధనమునకు వర్తించవు.
రక్షాబంధనము గట్టునప్పుడు పఠించ వలసిన మంత్రము :
శ్లో|| యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః| తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల||
 మహాబలుడైన రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఎవరిచేతనైతే కట్టబడినాడో, వానిచే నిన్నుగట్టుచున్నాను. ఓ రక్షాబంధమా! నీవు చలింపకుము.
నిర్ణయ సింధు”లో ఇంకా విశేషంగా ఇలా తెలిపారు.
 శ్లో|| తతో2పరాహ్ణ సమయే రక్షాపొటలికాం శుభాం| కారయే దక్షతైః శస్తైః సిద్ధార్థైః హేమ భూషితైః|| -హేమాద్రి
తరువాత అపరాహ్ణ సమయమందు శుభకరమైన రక్షాపొటలికను ( పొట్లం / Bundle) చేయాలి. అది శుభప్రదమై ప్రశస్తమైన అక్షతలతో – బంగారంతో అలంకరించ బడిన తెల్ల ఆవాలతో చేయాలి.
శ్రావణ పూర్ణిమ నాడు ధరించవలసిన ఈరక్షను “భద్ర” ఉన్నసమయాన ధరించినట్లైతే అది రాజును చంపుతుంది.
శ్లో|| ఉపలిప్తే గృహమధ్యే దత్త చతుష్కే న్యసేత్కుంభం| పీఠే తత్రోపవిశేత్ రాజా అమాత్యైః యుతశ్చ సుముహూర్తే| తదనం పురోధా నృపతేః రక్షాం బధ్నీతమంత్రేణ|| - భవిష్యే
అలికిన ఇంటి మధ్య నాలుగు కాళ్ల పీట మీద కుంభం ఉంచాలి. అక్కడ మరొక పీఠమందు రాజు మంత్రులతో కూడి మంచి ముహూర్తమందు కూర్చోవాలి. ఆపిదప పురోహితుడు రాజుగారికి మంత్రపూర్వకంగా రక్షాబంధనం చేయాలి.
శ్లో|| బ్రాహ్మణైః క్షత్రియైః వైశ్యైః శూద్రైః అన్యైశ్చ మానవైః| కర్తవ్యోరక్షితా చారో ద్విజాన్ సంపూజ్య శక్తితః||
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఇతర మనుజులు అందరూకూడా శక్తి కొలది బ్రాహ్మణుల పూజించి ఈరక్షా ఆచారమును (పైన తెలిపిన విధంగా)  చేసుకోవాలి.

పైవిషయాలన్నిటినీ లోతుగా ఆలోచించిన పిదప మనకు తెలిసేవిషయాలు ఏమంటే
౧. రక్షాబంధనం బ్రాహ్మణునిచే ధరించాలి. ఎందుకంటే మహా బలవంతుడైన రాక్షస రాజు బలిచక్రవర్తి కూడా బ్రాహ్మణునికి బద్ధుడైనాడు. అలాగే మనలోని రాక్షస ప్రవృత్తి తొలగింప చేయు శక్తి మంతుడు మంత్రశక్తి ఉన్న పురోహితుడే. అతని ఆశీర్వచనముతో అతనిద్వారా ధరించాలి.
౨. ఏసమయంలో పడితే ఆసమయంలో ధరించ రాదు. మధ్యాహ్నంకాని, సాయంత్రం ప్రదోష కాలంలో గానీ ధరించాలి. భద్ర కరణం (దీనికి యముడు అధి దేవత ) ఉన్న సమయాన అస్సలు పనికి రాదు. 


౩. ఏదిబడితే అది రక్షగా ధరించరాదు. అక్షతలు, బంగారంతాపడం కలిగిన లేక బంగారం రజను చల్ల బడిన తెల్ల ఆవాలు కలిపి ఒక పొట్లం క్రింద కట్టి, దానికి దారం చుట్టి అది రక్షగా ధరించాలి. 
వైదికమిత్ర” సౌజన్యంతో...

5 కామెంట్‌లు:

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.