దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2012, బుధవారం

దేవాలయ నిర్వహణా సమస్యలు - 2

వంద గుళ్లు కడతారు. ఒక అర్చకుని పెడతారు. నిజంగా పూజ చేసుకోవాలనుకునే అర్చకునికి ఒక గుళ్లో చెయ్యడానికి తక్కువలో తక్కువ ఉదయం తొమ్మిదింటి వరకు అర్చన, జపతపాలు సరిపోతాయి. మరి ఇతర దేవాలయాలలో ఎప్పుడు చేయాలి? ఈలోపు వచ్చే భక్తులను ఎవరు చూసుకోవాలి?  వచ్చే భక్తులు ఎక్కువగా ఉద్యోగాలకు వెళతారు కనుక ఉదయం తొమ్మిదిలోపే వస్తారు. మరి పూజకు సంకల్పం చేసుకున్న తరువాత ఎవరో భక్తుడు వస్తే వారికి హారతులు, తీర్థప్రసాదాలు ఇచ్చేది ఎవరు? సంకల్పించిన పూజ మధ్యలో ఆపి లేవాలా? అలా లేవకపోతే మేము వస్తే అర్చకస్వామి మమ్మల్ని అసలు పలకరించనుకూడా పలకరించలేదని ధర్మకర్తలకు కంప్లైంట్.

అర్చకునికి దక్షిణగా ఓ రెండు వేలు ఇస్తారు. అదే ఎక్కువ అనుకుంటారు. నిజానికి ఓ జీతగాడిని నియమించుకున్న భావనలో ఎక్కువమంది ధర్మకర్తలు ఉంటారు. జీతం ఇంత ఇస్తాం అంటారు గానీ, అయ్యా మీకు జీవన భృతిగా ఇంతమాత్రమే దక్షిణ ఇవ్వగలం అనే సంస్కారం ధర్మకర్తలలో కొరవడుతున్నది.  అటువంటి ధర్మకర్తలకు ఇక అర్చకుడు ఎటువంటి సూచనలు ఇవ్వగలడు? ఏమి పూజలు చెయ్యగలడు. పేరుకుమాత్రం గురువు, కార్య రూపంలో జీతగాడు గా అర్చకులు మిగిలి పోతున్నారు.


 ఒక ఇల్లు కూడా ఇవ్వరు, ఎక్కడో కర్మకాలి ఓ స్టోర్ రూమ్ వంటి గది ఇవ్వగలిగే వసతి ఉంటే ఇంకేంటి మీకు మహోపకారం చేసేస్తున్నామన్న భావన లో ఎక్కువమంది ఉంటున్నారు. ఒక్క గదిలో అసలు ఎలా ఉండగలరు? ఇంట్లో ఆడవాళ్లకు ఇబ్బంది రోజులలో ఎక్కడ ఉండాలి? ఒకవేళ అర్చకుడు వాళ్లిచ్చే గదిలో ఉండడానికి సిద్ధపడితే..., అర్చకుడు, అతని కుటుంబము దేవాలయానికి కాపలా దారులుగా ఉండవలసి వస్తుంది. దేవాలయ పాత్రల శుభ్రతకు ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రసాదాలు అవీ అర్చకుని భార్య వండి పెట్టాలి. అదేమంటే ధనంలేదు అంటారు. కానీ కొత్తగుడి ప్రారంభిస్తారు.  రెండు మూడు వేలలో ఇలా అన్ని సదుపాయాలు కలిసొచ్చే అర్చకుడు కావాలి చాలా మందికి. భోజనానికి ఎలా గడుస్తున్నది అనికాని, కుటుంబ పోషణ జరుగుతున్నదా అని కానీ అడుగరు. అంత తెలివి తక్కువ ప్రశ్న మరొకటి లేదని వారికి తెలిసు.

ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక దేవాలయానికి ఇద్దరు అర్చకులు కావాలి. ఒక ప్రధానా ర్చకులు, ఒక సహాయకులు.   అర్చకునికి మడి ఆచారానికి సరిపోయే ఇల్లు ఇవ్వాలనే అవగాహన ధర్మకర్తలకు ఉండాలి. జీతం కనీసం కుంటుంబ పోషణకు సరిపడా ఉండాలి. అర్చకుని కుటుంబం కాక, వాచ్ మెన్ కుటుంబం కూడా ఆ దేవాలయానికి దగ్గరలో ఉండాలి. దేవాలయ కాపలా, శుభ్రత మొదలైన వి వారు నిర్వహించాలి. ఎక్కువ ప్రసాదాలు వండ వలసి ఉంటే వంటవారిని పెట్టడం మంచిది.

దేవాలయ నిర్వహణా సమస్యలు

నేను చేస్తున్నాను అనే భావన తగ్గాలి : దేవాలయంలో దేవునికి రోజూ ఒక పూలమాల కూడా వేయలేని స్థితిలో ఉంటారు ధర్మ కర్తలు, కానీ గుడి మీద గుడి కడతారు. ఆలయ నిర్వహణకు ధనం ఉండదు. రోజూ దేవుడికి దేవాలయం తరపు న ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితి. అఖడం అంటే నూనె చాలా ఖర్చవుతుందని దీపం పెట్టి వదిలి వేయమంటారు. పోనీ ఎవరైనా దాతలను వారు అడుగరు. దానికి అహం అడ్డు వస్తుంది. వారు ఎవరినీ అడగకుండానే ఎవరో రావాలి. ధనం కురిపించాలి. పోనీ ఎవరో వచ్చి ఇచ్చినా అది మరో దేవాలయ నిర్మాణానికి ఖర్చు పెడతారు. దర్శనానికి వచ్చేవారే రోజూ ఎవరూ ఉండరు. కానీ అర్చనకు, అభిషేకానికీ, హోమానికి చివరికి కొబ్బరకాయ కొట్టుకోడానికి కూడా టికెట్ పెడతారు.

    దేవాలయ నిర్వహకులకు ఉండవలసిన ప్రధాన అర్హత ధనం కలిగి ఉండడమా? ధర్మాచరణ కలిగి ఉండడమా? అని ప్రశ్నించుకుంటే ధర్మాచరణ కలిగి ఉండడమే అని చెప్పవచ్చు. వేద మార్గాన్ని నమ్మి ఆ ధర్మాన్ని ఆచరణలో చూపగలిగే శ్రద్ధ, భగవద్భక్తి ఉన్న ధర్మకర్త నిర్వహణలో ఉన్న దేవాలయాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. కేవలం ధనం ఉండి, పేరుకోసం, డాబుకోసం దేవాలయాలను నిర్మించడం అనర్థదాయకమే అవుతుంది. రెండూ కలిగిన ధర్మకర్త అయితే ఇక ఆదేవాలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లుతుంది అనడంలో సందేహంలేదు. భక్తి కలిగిన ధర్మకర్త తన శక్తి వంచనలేకుండా దేవాలయానికి తన వంతు ఆర్థిక సహయం చేయాలి. కానీ దేవాలయాలు నేటి రోజులలో ఒక్క వ్యక్తి సహాయంతో నడపలేము కనుక తన వద్ద ధనం చాలని పక్షంలో నలుగురి సహాయం అర్థించడానికి మొహమాట పడకూడదు. "నేను చేస్తున్నాను, నాకొసం చేస్తున్నాను అనుకున్నప్పుడు అహం అడ్డువస్తుంది. అదే భగవంతుడు నడిపిస్తున్నాడు, భగవత్కార్యం చేస్తున్నాను అనుకున్నప్పుడు అలా అడిగి మరీ కార్యం పూర్తిచెయ్యడంలో ఒక తృప్తిఉంటుంది." ఇది గుర్తెరిగి భగవత్కార్యానికి నలుగురి సహాయాన్ని తీసుకుని మరీ ముందుకు వెళ్లినప్పుడు దేవాలయ నిర్వహణ అనేది సుగమం అవుతుంది.



15, మే 2011, ఆదివారం

దేవాలయాలు - నిర్వహణ - కొన్ని విశేషాలు

      పూర్వం రాజులు ఆయా ప్రాంతాలలో సంచరిస్తూ అక్కడ తమకు ఎదురైన దేవతా మూర్తుల అద్భుత శక్తులకు ముగ్ధులై దేవాలయములను నిర్మించే వారు. అలాగే దేశమున కరువు కాటకములు, మానసిక పైత్యములు ప్రబలినపుడు  పండితుల సూచన మేరకు కొందరు  రాజులు దేవాలయములను నిర్మించే వారు.  ఇది ఉత్తమమైన పద్దతి.

   కొందరు పేరు ప్రతిష్ఠలు లేదా అధికారము చిరకాలము నిలుపుకొనుటకు నిర్మించేడివారు. నేడు కూడా పేరు కోసమో, పరపతి తెలుపుకొనుటకో/ పెంచుకొనుటకో, మరికొంచెం నీచ స్థాయికి దిగి దేవాలయాల పేరుతో ధనమును చేకూర్చుకొనుటకో దేవాలయములు నిర్మిస్తున్నారు.

                                               

ఇవేవీ కాక మరో కారణం వలన కూడా దేవాలయములను నేడు నిర్మించు వారు కనిపిస్తున్నారు.

   మనలో చాలా మందికి ఎంతోకొంత సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉంటుంది. కొందరికి అది సంకల్పంగానే ఉంటుంది. కొందరి విషయంలో అది కార్య రూపం దాలుస్తుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడం, అనాథలకు - వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, అన్నార్తులకు అన్నదానం చేయడం, ఉచిత వైద్య సేవలు అందజేయడం ఇలా అనేక  రూపాలలో తమ సేవను సమాజానికి పంచుతుంటారు. వీటన్నిటికంటే ఉత్తమమైన సేవ ఏమిటి అని అందులో కొందరు కొంచం ముందడుగు వేసి ఆలోచిస్తారు. మన జీవిత గమ్యం సర్వవ్యాపి అయిన ఆపరమేశ్వరునిలో లీనమవడమే అని నమ్మిన కొందరు సాధ్యమైనంత ఎక్కువ మందికి అటువంటి పురోగతిని సాధించుటలో సహాయపడడమే నిజమైన సేవ అని తెలుసుకుంటారు. కొందరికి ఆకలి బాధ ఉండవచ్చు. కొందరికి ఆరోగ్య బాధ ఉండ వచ్చు. కాని నేటి రోజులలో ఎందరికో మానసిక బాధలు. అన్నీ ఉన్న వానికీ, ఏమీలేనివానికీ కూడా ఈ మనోవ్యధలు తప్పడం లేదు. ఈ మానసిక అస్థిరతను సరిచేయుటకు వేద సాంప్రదాయమున అనేక ఉపాయములు ఉన్నవి. అందు ‘భక్తి మార్గము’ ఒకటి. అటువంటి భక్తి మార్గమును అవలంబిచుట వలన ఇహమున కల అనేక సమస్యలను సరిదిద్దుకొన గలుగుటయే కాక, ఏదైతే జీవన పరమ గమ్యమని ఆధ్యాత్మికులు నమ్ముదురో ఆ గమ్యమును చేరుటకూడా సులభతరమౌను. కనుక ఈ విషయముల యందు అత్యంత నమ్మిక ఉన్న కొందరు ఒక దేవాలయమును  నిర్మించెదరు. సద్గురువులైన పండితులను అర్చకులుగా నియమించి, వారి ఆదేశానుసారం నడుస్తూ తాము తరించడమే కాక అనేక మందికి ఒక ఆధారామును ఇచ్చి తరింపచేసిన వారవుతున్నారు.   వీరు ఉత్తమమైన ధర్మకర్తలు అని చెప్పవచ్చు.


    ఒక విగ్రహము పెట్టి, అందంగా  నాలుగు గోడలు నిర్మించినంత మాత్రమున అది దేవాలయము అయిపోదు. ఒక వేళ అలా పిలువబడినా  అది ప్రాణం లేని దేహముతో సమానము. సర్వఙ్ఞుడైన ఆచార్యుడు( అర్చకుడు), అతని ఆదేశానుసారము నడుచుకొను ధర్మకర్త , ఆచార్యుని ఉపాసనచే కలుగు మంత్ర శక్తి, ధర్మనిష్ఠ, నియమ పాలన  అనునవి ఐదు పంచప్రాణముల వంటివి. నిర్మాణము కేవలము దేహము మాత్రమే.  దేవాలయము అనునది ఒక అద్భుత శక్తి కేంద్రము. దేవాలయము నుండి ఆశక్తి తరంగములు అక్కడి ఉపాసనా శక్తిని బట్టి దేశ దేశాంతరములు ప్రసరిస్తాయి. కేవలము మనము మాత్రమే పూజలు జరిపితే అక్కడ కొంత శక్తిమాత్రమే కేద్రీకృతమౌతుంది. అనేక మంది, అనేక పర్యాయములు నిరంతరాయంగా జరుపుతూ ఉంటే అక్కడ అఖండ శక్తి ప్రసారం జరుగుతుంది. ఆ అవకాశం దేవాలయములలో మాత్రమే ఉంది. తత్కారణం గా ఎన్నో అలజడులతో దేవాలయమునకు వచ్చిన వారికి కూడా దేవాలయములో అడుగు పెట్టగానే ఒక చక్కటి ప్రశాంతత కలగడం, అసలు పరిష్కారమే లెదు అనుకున్న సమస్యలకు కూడా భగవంతుని సన్నిధిలో ఒక పరిష్కారం లభించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ పేద, ధనిక భేదంలేదు. ఎవరు ఎలా వచ్చినా ఆర్తితో ప్రార్థన చేసినంత మాత్రముననే ఒక సద్భావన మనసును ఆక్రమిస్తుంది. అటువంటి ఉత్తమ ఫలితాలు కలగాలంటే ధర్మకర్తలు, అర్చకులు ఉత్తములై ఉండాలి. మొదట వీరిద్దరు భక్తులైన నాడు మిగిలిన వారికి మార్గము చూపగలరు. కేవలము చూపులకు భక్తి నడవడిక కలిగిన ధర్మకర్తలు, అర్చకులు దేవాలయమును  ఉత్తమముగా తీర్చిదిద్దలేరు. ఒకరికొకరు పరస్పర సహకారము వలన మాత్రమే శక్తి కేంద్రమైన దేవాలయము తయారవగలదు. 

సేవలన్నిటిలోకీ ఉత్తమమైన సేవ ఈ దేవాలయ నిర్వహణ. దీని ద్వారా ఎందరో ఆర్తులకు పరమేశ్వరుని అనుగ్రహము కల్పించ వచ్చు.  భక్తి తత్పరులైన ధర్మకర్తలు  పరమ భక్తులైన, ఉపాసకులైన అర్చకులను నియమించి వారి సలహా ప్రకారము దేవాలయమును నిర్వహించవలెను. అప్పుడు అది ఆనంద నిలయము అవుతుంది. లేనిచో కేవలము పేరుకు మాత్రమే దేవాలయముగా నిలచి చేతలకు అది ఒక వ్యాపార కేంద్రము అవుతుంది.

"దేవాలయాలు" అనే లేబుల్ తో ఉన్న మరిన్ని టపాలను ఇక్కడ చూడండి.  

15, డిసెంబర్ 2009, మంగళవారం

కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా?


"కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి" ఏదేవాలయానికి వెళ్లినా సాధారణంగా దేముడి కంటే ముందుగా పెద్దపెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఈ బోర్డు. కొన్ని దేవాలయాలలో ఉండదు. అంటే అవి ఈ మధ్యే కట్టిన దేవాలయాలు అని తెలుసుకోవచ్చు. ఆ దేవాలయ కమిటీ వారికి ప్రజలనుండి సంపాదించే మార్గాలు ఇంకా పూర్తిగా తెలియలేదు అని అర్థం. అలా అని ఎల్లకాలం అలానే ఉండరండీ. త్వరలోనే వారికి కాస్తో కూస్తో భగవంతుడిమీద ఉన్న భక్తి కాస్తా, ధనం మీదకి మళ్లు తుంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎవరినుండి ఎంత ఎలా చందాగా పోందవచ్చు? ఈ చందాలు కాకుండా ధనాన్ని కూడ కట్టడానికి ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయి? అనే అన్వేషణ మొదలవుతుంది ధర్మకర్తలలో. ఇక ఆక్రమంలో ఈ బోర్డు వచ్చేస్తుంది. ఇది సాధారణమైపోయింది ఈమద్య దేవాలయాలలో.

భక్తులు హుండీలో మాత్రమే కానుకలు వేయాలి అని బోర్డు పెట్టడంలో ఆంతర్యం. భక్తులు కానుకలు హుండీలో కాక మరెక్కడ వేస్తున్నారు. ఎక్కడవేస్తారు? అర్చకునికి దక్షిణగా ఇస్తారు. ఇదే ఇదే ఇక్కడే చిక్కంతా. మరి దేవాలయం వారిచ్చే వెయ్యి, రెండు వేలు కాకుండా? వారిచ్చే ఓ స్టోర్ రూములాంటి వసతి గది కాకుండా ఇంకా ఆ అర్చకుడు పై ఆదాయం సంపాదించుకుంటుంటే దేవాలయం ఏమైపోవాలి? దాని అభివృద్ధి ఎమైపోవాలి? అర్చకుడు అభివృద్ధి చెందితే సరిపోతుందా? గుడి గురించి ఎవరు పట్టించుకుంటారు? అని ధర్మకర్తలు తెగ మథనపడి ఇలాంటి ధర్మ నిర్ణయం తీసుకుంటారన్నమాట.

అసలు ఇది ఎంత వరకు సమంజసం. చందాల ద్వారా గుడిని అభివృద్ధి పరచాలనుకోవడం కొంతవరకూ సమంజసం. ఇది కూడా ఓ విధంగా చేతకాని తనమే.
పూర్వకాలంలో రాజులు, లేదా గ్రామ పెద్దలు దేవాలయాలు నిర్మించే వారు. వారికి ధనానికి కొరతేమిటి? దేవాలయ నిర్మాణం ఖర్చులన్నీ ఒక్కరే భరించే వారు. గుడి కట్టిన తరువాత దాని పోషణకు కావలసిన ధనాన్ని ,అర్చకుని జీవనానికి కావలసిన ధనాన్ని కూడా వారే ఇచ్చేవారు. ఇందుకోసమే ఒక్కో దేవాలయానికీ కొన్ని వందల ఎకరాల భూములను రాసిచ్చే వారు. ఆ భూములలో పండిన పంటల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ఖర్చులన్నీ నడిచేవి.

కాలం మారింది. తరువాతి కాలంలో ప్రభుత్వాలు ఆ భూములను ఎలా స్వాధీన పరుచుకున్నాయో,అర్చకులకు ఏ మాత్రం మిగిల్చాయో అదంతా జగద్విదితమే.
మరి నేడు కొత్త గా కట్టే దేవాలయాల సంగతి ఏమిటి? దేవాలయాలు ఎందుకు కడుతున్నారు? చాలా చోట్ల నేడు భూములు అన్యాక్రాంతమవకుండా, దానిమీద కొంత పెత్తనం చెలాయించడానికి దేవాలయాలు కడుతున్నారు. కట్టే వారు వారిధనంతో కట్టేంత ఉద్దాత్త హృదయం ఉండదు ( ఒక వేళ వారి వద్ద ఓ దేవాలయం నిర్మించ గలిగే ధనం ఉన్నా సరే ). అందరివద్దా చందాలు వసూలు చేయాలి. దానీ లో వీరిదీ ఓ 5% వాటా ఉంటుంది . అంతకూడా ఉండదు. మొత్తానికి వారిచిన్న ధనంతోనూ , వీరిచ్చిన ధనంతోనూ దేవాలయం పూర్తిచేస్తారు. మరి గుడి కట్ట గానే కళ్యాణ మవుతుందా? దానికి ఓ అర్చకుని నియమించాలి. అతనికి జీతం సమకూర్చాలి. మరి నిత్యం ఓ కొబ్బరికాయ కొట్టాలన్నా ఖర్చు ఉంటుంది కదా? దీపారాధనకు నల్ల నువ్వుల నూనె ఎంత ప్రియం అయిపోయిందో. ఆ ఖర్చులన్నీ ఎలా? మళ్లీ చందాలకోసం ఎదురు చూపులు. గుడి కడుతున్నామంటే ఏదో చందా ఇస్తారు కానీ. నిత్య ఖర్చులకు అంతగా ఎవరూ చందా ఇవ్వడానికి ముందుకు రారు. కొంత కాలం ఎదో తప్పదనుకుంటూ ఖర్చు పెడతారు మన ధర్మకర్తలు. కానీ అది ఎంతోకాలం సాగదు. మొత్తం సంపాదించిన డబ్బులన్నీ గుడికే ఖర్చుపెడితే ఇంట్లో ఆడవాళ్లు గరిటలు తిరగేస్తారు మరి. దానితో ధర్మ కర్తల దృష్టి అర్చకుని ఆదాయం మీద పడుతుంది. రోజూ వచ్చే భక్తులు ఏవొ పూజలు చేయించుకుని ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుంటూ ఉంటారు. ఆ ఆదాయంతో అర్చకుడు తెగసంపాదించేస్తున్నాడని వీరికి మనసులో ఆవేదన మొదలవుతుంది. దాని ఫలితమే ఇదంతా?

కొంతమంది దేవాలయాన్ని పూర్తిగా తమఖర్చుతో కట్టించే ధర్మక్ర్తలూ ఉన్నారు. తరువాతి కాలంలో ఖర్చులు కూడా వారే భరిస్తారు. కానీ అర్చకుని ఆదాయం వద్దకు వచ్చేసరికి ఒకరకమైన బాధ మొదలవుతుంది. అతని ఆదాయానికి, తమ హుండీ ఆదాయానికీ పోలిక మొదలవుతుంది. నెమ్మదిగా పైన చెప్పిన బోర్డు వస్తుంది. కుదరదని వ్యతిరేకించిన అర్చకుడు తొలగించ బడి ఓ కొత్త అర్చకుడు వస్తాడు.( ఆ వచ్చే అర్చకుడు ఎందుకు వస్తాడో తెలుసా. అతనికి ఆ గుడి వారిచ్చే వెయ్యా, రెండు వేలు కూడా గతిలెదు కనుక. )

ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి. అసలు వచ్చే భక్తులు కానుకలు వేసే ఆచారం ఎందుకు వచ్చింది?
1. అర్చకుని చేత పూజ చేయించుకున్న తరువాత అతనికి దక్షణ సమర్పించే ఆచారం ఎప్పటి నుండో వున్నది. అది ఎందుకో తెలుసా? మన హిందూ వ్యస్థను ప్రధానంగ 4 వర్ణాలు గా విభజించారు. ఒక్కో వర్ణానికీ ఒక్కో బాధ్యత అప్ప గించబడింది. బ్రాహ్మలు వేదవిద్యను అభ్యసించి, అందు గల ధర్మాలను నలుగురికీ తెలియచెప్పాలి. క్షత్రియులు ఆ వేద ధర్మాన్ని అందరూ అనుసరించే టట్టు చూడాలి. వైశ్యులు ధర్మానుసరణకు కావలసిన ధనమును సముపాదించాలి. శూద్రులు కృషీ వలులై అన్న సమృద్ధిని కలిగించాలి. ఈ బ్రాహ్మలు వేదాధ్యయనంలో ఉండి ధర్మ సూక్ష్మాలను గ్రహించి తమతో పాటు నలుగురికీ తగిన ముక్తి మార్గమును ఉపదేశిస్తూ ఉండాలి. మిగతా వర్ణాల వారు ఆ ధర్మాలను ఆచరిస్తూ ధర్మ మును సంరక్షించుటలో ఆ బ్రాహ్మణులకు సహాయపడాలి. విద్యనర్జించటమె కానీ , సంపాదించటం తెలియని బ్రాహ్మల కుటుంబ పొషణ ఎలా జరగాలి? అందుకోసం ప్రతి వర్ణం వారు ఈ బ్రాహ్మణ వర్ణానికి తగిన విధంగా సహాయపడటం మొదలైంది. ఈ క్రమంలో దక్షిణ అనే సాంప్రదాయం ఏర్పడింది. ఇక సంపాదన గురించి దిగులు లెనప్పుడు ఆ బ్రాహ్మణులు ముక్తి మార్గాన్వేషకులై ఆ మార్గంలో నలుగురినీ నడిపి లోక హితం చేసే వారు.


( ఇక్కడ గ్రహించ వలసిన ప్రథాన విషయం ఒకటుంది. ఈ సాంప్రదాయంలో అన్ని వర్ణాలకూ తగిన న్యాయం జరగలేదని వాదించే వారు నేడు చాలా మంది ఉన్నారు. ఈ వర్ణ విభజన ఆర్థికంగా చూస్తే రాజుకు రాజ్యాధికారం వచ్చింది. వైశ్యునకు ఆర్థిక వ్యవహార చక్షతనిచ్చింది. శుద్రునకు భూమిని ప్రసాదించింది. మరి బ్రాహ్మణునకు ఏమి ఇచ్చింది? విద్యను ఇచ్చింది. కేవలం విద్యను మాత్రమే. ఆ విద్యకు గౌరవం ఇచ్చి మిగతా వారు తమ తమ సంపదలను దానం గా ఇచ్చే వారు. అంటే దానం తీసుకునే స్థితిలోనే బ్రాహ్మడు ఉన్నాడు కానీ. ఇవ్వ గలిగే స్థితి కాదతనిది.

సరే ఇది కాదు గమనించ వలసిన విధానం. మన వ్యవస్థ ఆర్థిక దృష్టితో చేయబడినది కాదు. మోక్షం అనే దృష్టితో చేయబడినది. అందరికీ మోక్షం కలగాలి. అదే మన జీవన విధాన ప్రధాన లక్ష్యం. మోక్షం అంటే ... ఎందరో ఎన్నో చెప్పారు. అది మరో టపాలో చూద్దాము. ఒక్కమాటలో చెప్ప్పాలంటే మోక్షమంటే ఆనందం. నిశ్చల ఆనందం. ఆ ఆనందం అందరికీ సమానంగా ఉండాలి అదే మన హిందూ మత సాంప్రదాయ ప్రధాన లక్ష్యం. మరి అందిందా అందరికీ ఆనందం . నిస్సంకోచంగా అందింది. ధర్మం పాఠించిన ప్రతీ ఒక్కరికీ అందింది. జీవించినంతకాలం ఆనందం వారి జీవితాలలో తాండవించింది. ధర్మం తప్పిన ప్రతీ ఒక్కరికీ అది దూరమయ్యింది. దూరమవుతూనే ఉంది. బ్రాహ్మలు కూడా దీనికతీతులు కారు. )
2. భక్తులు మొక్కులు మొక్కి హుండీలలో కొంత ధనాన్ని వేస్తారు. లేదా ఎటువంటి మొక్కూ లేకపోయినా దేవాలయ నిమిత్తం హుండీలో కానుకలు వేస్తారు. దేవాలయం కోసం అని వేసే విశాల హృదయులు నేడు చాలా తక్కువ. మొక్కుల రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువ. మొక్కుల ద్వారా వచ్చే ఆదయానికి ఆశపడి కొన్ని దేవాలయాల వారి ప్రచారం మరీ ఎక్కువవుతున్నది.

ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ధర్మ కర్తలు, అర్చకుని ఆదాయాన్ని నియంత్రించే మార్గాలను వెతుకుతారు. అతనికి హారతి పళ్లెంలో వసే చిల్లరతో సహా అతను హుండీలోనే వేయాలి అనే నియమంతో అర్చకుని నియమిస్తారు. ఒక వేళ ఏ భక్తుడైనా ఇదేమిటని ప్రశ్నించి నేను అర్చకునికే వేస్తాను అని వాదించింనా లాభం లేదు. అతను వెళ్ల గనే ఆ దక్షిణ హుండీలో పడాలి. ఎండోన్ మెంటు దేవస్థానాలలో ఇది మరీ అధ్వాన్నం. అలా పళ్లెంలో వేసే ధనాన్ని అర్చకుడు దొంగ తనంగా ఎవ్వరి కంటా కనపడకుండా ఇంటికి తీసుకు వెళ్ల్లాలి. ఇలా మొదలైన దొంగతనాలు నగల వరకూ ప్రాకు తాయి కొందరు అర్చకుల విషయంలో. ఇది నిస్సంకోచంగా ఖండించ వలసిన విషయం. ఇందులో ఎవరూ ఆ అర్చకులను వెనకేసుకు రాకూడదు.అసలు దొంగతనం ఎందుకు చేయాలి అర్చకుడు?
తన డబ్బును దేవస్థానం వారు అదో హక్కులా లాక్కుంటుంటే అర్చకుడు చూస్తూ ఊరుకోవలసిందేనా? దీని కేమిటి పరిష్కారం? మీదృష్టిలో ఇది సబబేనా?

గమనిక: ఏ దేవాలయంలోనూ నేను అర్చకుడిని కాదు. సర్వ స్వతంతృడి నైన పురో హితుడిని. పూజ చేయించమని గౌరవంతో ఎవరైనా నా దగ్గరకు వస్తే చేయిస్తాను. లేదా ఇంట్లో కూర్చుంటాను. అర్చకునిగా మొదట కొంతకాలం చేశాను కనుక, తోటి వారి కష్టాలు చూస్తున్నాను గనుక మనసాగక ఇదంతా రాశాను. ఎవరి మనసైనా నొప్పించి ఉంటే మన్నించండి. ఈ విషయంలో మీరు చేయగల సహాయమేమిటో ఆలోచించండి. ఒక్కసారి మీదగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ అర్చకుని జీతం ఎంత? అతని కి వచ్చే ఆదాయం ఎంత? అతనికి వసతి సదుపాయం కల్పించారా? కల్పిస్తే అది ఎలాఉంది? గమనించి వచ్చి మీవ్యాఖ్యను రాయండి.

11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఒక దేవాలయం




ఒక దేవాలయం కట్టడానికి సంకల్పం చేసిన దగ్గరనుండీ.., విగ్రహం తేవడం, దేవాలయ నిర్మాణానికి, నిర్మాణ అనంతరం నిత్య పూజలకు అర్చకుని జీతభత్యాలకు తగిన ఆదాయం కావాలి కనుక తోచిన చందాఇచ్చి, నలుగురినీ ఇమ్మని భక్తులను ప్రోత్సహించడం, గుడి పూర్తయిన తరువాత ఓ అర్చకుని చేర్చడం మొదలైన ప్రతి పనిలోనూ నావంతు తోడ్పాటును ఆలయ కమిటీ వారికి అందించాను. వారు నన్ను చాలా గౌరవించారు, గౌరవిస్తున్నారు కూడా. “ మీ సహకారం వల్లనే ఓ సంవత్సరం తిరగకుండానే మేము దేవాలయం కట్ట గలిగాము. మీ వక్చాతుర్యం గొప్పది. మీకు ఏ విషయం ఎలాచెప్పాలో చక్కగా తెలుసు.” అంటూ తెగ పొగిడేస్తారు. నాకు తెలుసు వాళ్లు కాస్త ఎక్కువ పొగుడుతున్నారని. కానీ నేను ఇవన్నీ వారి పొగడ్తల కోసమో, లేదా పేరుకోసమో చెయ్యలేదు.

వారు సంకల్పించినది కార్యం దైవకార్యం కాబట్టి, నాకు తెలిసింది అందరినీ దైవకార్యాలు చేసేటట్లు ప్రోత్సహించడమే కాబట్టి, నేను మంచిపని అని నమ్మాను కాబట్టి నేను ఆచరించి నలుగురినీ ఆచరించమని ప్రోత్సహించాను. అందులో కొంత ఆనందం పొందాను.

అయితే ఈ మధ్య నేను ఆ దేవాలయానికి వెళ్లిన ప్రతిసారీ వారు మీరు మళ్లీ ఏవో ఒక కొత్త కార్యక్రమాలు పెట్టి భక్తులు రోజూ దేవాలయానికి వచ్చేటట్లు చేయాలి. మీ వల్లనే ఇది సాధ్యం. ఆ పూజారి ( అర్చకులు ) ఉన్నారుగానీ వారికి మీరు చెప్పినట్లు భక్తులకి చెప్పడం రావటం లేదు. ...... ఇలా మళ్లీ భజనలు ప్రారంభించడం మొదలుపెట్టారు. నాకెందుకో కొంచం బాధనిపించింది.

రోజూ భక్తులు దేవాలయానికి రావడం మొదలు పెడితే దేవాలయ ఆదాయం పెరుగుతుంది. దానితో ఆలయ ఖర్చులు చూడవచ్చు అని వారి భావన. కానీ నాకు వారి భావం నచ్చలేదు. ఎవరో రావాలి , కానుకలు వేయాలి, ఆ కానుకలతో దేవాలయం నడవాలి. ప్రస్థుతం కానుకలు రావటం లెదట. అందువల్ల నిరంతరం వెలగవలసిన అఖండ దీపం ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే వెలుగుతోంది. నిత్య నైవేద్యం కోసం అర్చకునికి ఇస్తానన్న బియ్యం ఇవ్వటం లేదు. ఆలయం శుభ్రం చేయించడానికి పనిమనిషిని పెట్టటానికి కూడా డబ్బులు లేవట వారివద్ద. ఇలా అనేక పనులు ( ఖర్చుతో కూడినవి ) సరిగా చేయటం లేదు.

నేను ఇదంత చూచి ఒకటే చెప్పాను. నేను చెప్పే కబుర్లకు భక్తులు వస్తారనుకోవడం పొరపాటు పని. మీరు ఆచరించే పనిని బట్టే భక్తులు రావడం, రావక పోవడం ఉంటుంది. నేనేది చెప్తానో అది నేను కూడా ఆచరిస్తాను. అందుకే కోంత భక్తులు అనుసరించే అవకాశంఉంది. కానీ నేను ఏదైనా చెప్పాలంటే ముందు నేనది మంచిది అని నమ్మాలి. భక్తులు రావడానికి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను. కానీ ముందు భక్తులు రావడానికి నా మాటల కన్నా, మీ చేతలే ముఖ్యమైనవి.
మీరు ప్రతినిత్యం పూజను సరిగా జరిపే మార్గం చూడండి. రోజూ అభిషేకానికి పాలు లేవు. దీపారాధనకు నూనె లేదు అని పూజను చేయడంలో అశ్రద్ధవహిస్తే , భక్తులు వచ్చేవారుకూడా రారు. ఎందుకంటే ఎక్కడ పూజలు సక్రమంగా జరుగుతాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ భక్తులు ఉంటారు. భక్తుల కోరికలు తీరాలంటే అక్కడి భగవంతుడికి మంత్రబలం ఎక్కువగా ఉండాలి. అంటే విశేషమైన పూజలు నిరంతరం జరుగుతూ ఉండాలి. ఆ మంత్ర బలం వల్ల దేవాలయంలో ప్రశాంతమైన స్థితి నెలకొంటుంది. ఎన్నో ఒత్తిళ్లలో దేవాలయానికి వచ్చిన వారికి కూడా అడుగిడిన వెంటనే ఓ అవ్యక్తమైన మానసిక శాంతి కలుగుతుంది. ఇంకా అక్కడే ఉండాలని పిస్తుంది.

ఇలా జరగాలంటే ఆలయ ధర్మకర్తలకు, అర్చకునికి భగవంతునిపై అచంచల విశ్వాసం ఉండాలి. స్వామికి జరుగవలసిన సేవ ఏదైనా జరగకపొతే తాము ఓ పూట భోజనం మానివేసి అయినా ఆ సేవ జరిపే చిత్తశుద్ధి ఉండాలి. అలాంటి వారికే భగవంతుడు వశుడవుతాడు. మీకు అలాంటి పట్టుదల ఉంటే చెప్పండి, నా సహకారాన్ని తప్పక అందిస్తాను. మనం అందరం కలిసి ఈ దేవాలయాన్ని ఓ ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దుదాము. మీకు కూడా ఇటువంటివి కొత్త కనుక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాటిని నిజాయితీతో ఒప్పుకుని సరిదిద్దుకునే మనస్థత్వం మీకుండాలి. ఇంకొక విషయం మీరు దేవాలయంలో టికెట్ లు ఎప్పుడు పెడతారో అప్పటినుండీ నేను తప్పుకుంటాను. ఆ టికెట్ పద్ధతికి నేను వ్యతిరేకిని. అందుకు మీకు సమ్మతమైతే మనం ముందుకు సాగుదాము. అని చెప్పాను.

వారందరూ మీ సహకారముంటే మేము ఏమైనా చెయ్యగలము. మీరు చెప్పినవన్నీ తప్పక పాటిద్దాము. అని చెప్పారు. వారి స్పందన చూసి నేను కాస్త ఆనంద పడ్డాను. కొంత కాలం గడిచింది. ఒక నాడు దేవాలయానికి వెళ్లే టప్పటికి ఓ బోర్డు కనిపించింది. “ కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి ”. :)