ప్రశ్నలు - సమాధానాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రశ్నలు - సమాధానాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జులై 2011, బుధవారం

మంత్ర జప సాధన లో తలెత్తే కొన్ని సందేహాలు - సమాధానాలు

శర్మ గారికి నమస్కారములతో!


     ఒక్కొక్క సారి గాయత్రీ జపము లో కళ్ళు మూసుకుని మనస్సులో ధ్యానం చేసుకోవడం కుదురుట లేదు. మనస్స్సు కుదురు గా ఉంచాలంటే ఏమి చేయాలి? ఈ ధ్యానములో, గాయత్రీ మాతను ఊహ చేసుకొని జపం చేయ వచ్చా? లేక ఇతర దేవత లేదా గురు స్వరూపములను ఊహ చేయవచ్చా? ఇది కూడా మనసు ఎక్కువ సేపు నిలబడదు. కొంత సేపు ఒక దేవత, తరువాత కొంత సేపు ఇంకొక దేవత లేదా గురు స్వరూపము  తో జపము చేయవచ్చా? అసలు గాయత్రీ మంత్రం ఎలా చేయాలి? 

  మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.

                                      

"మననాత్ త్రాయతే ఇతి మంత్రః "   పదే పదే పఠించడం ( మననం చేయడం ) వలన రక్షణ కలిగించునది  మంత్రము అన్నారు.  గాయత్రీ లేదా మరో దేవతా  జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్ఠము గా ఉఛ్చరించుట ప్రధానము.( అనుదాత్త ఉదాత్త స్వరితములతో సరిగా ఉచ్ఛరించాలి. వీటిగురించి మరో టపాలో తెలియజేస్తాను. ) ప్రస్థుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి తెలుపుతాను.

౧) పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం.   ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం బ్రాహ్మణుడు వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. ( ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు) ప్రాధమికం అనే దృష్టితో  ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు.  ప్రతీ సాధకుడూ సాధనలో పెట్టాలనుకునే ప్రతీ మంత్రమునూ కూడా ఈ మొదటి మెట్టుతో మొదలుపెట్టాలి. అప్పుడే సాధన సమర్థవంతంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని తీసుకుని ముందు సద్గురువు దగ్గర కొన్ని సంతలు  చెప్పుకుని ( ఎన్ని సార్లు అనేది మీ గ్రహణ శక్తిని బట్టి గురువు నిర్ణయిస్తారు. వారు మీకు వచ్చింది ఇక మీరు స్వయంగా చదువుకోవచ్చు అని చెప్పిన తరువాత) , కొన్ని రోజుల పాటు వల్లె వెయ్యాలి. ( శబ్దం బయటకి వచ్చేటట్లు ఉచ్ఛైశ్వరముతో మంత్రమును గురువు సన్నిధిలో పదేపదే చదవాలి. గురువు సన్నిధిలో స్వరముతో చదవడం  బాగా అలవడిన తరువాత గరువులేనప్పుడు జపసమయంలో కూడా  కొన్ని రోజులు సాధన ( ఓ పది పదిహేను రోజులు  రోజూ కనీసం మూడువందలసార్లు చదివితే సరిపోతుంది ) చెయ్యాలి. తరువాత రెండవ  మెట్టుకి వెళ్లాలి. 

౨) పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి .   ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు ( జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన ( మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన ) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.

౩) మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం ( మననం చెయ్యడం ) మధ్యమం.  పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి. ఆ మంత్రాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఎక్కడైనా తప్పులు పడుతోందేమో తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. జపం చేస్తున్నప్పుడు మనసుకి చెప్పవలసిన అసలైన పని ఇదే. సాధారణంగా  మంత్రం తప్పులు రాదు. కానీ రెండు కారణాల వలన తప్పులు దొర్లడం బాగా గమనిస్తే తెలుస్తుంది.

అ) మరో ఆలోచనలో పడడం
ఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది. ( కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి )  ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.


ఆ) మనసు తొందర పడడం :    నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు  లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచెయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం".  అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.

పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి  త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే
కారణం. కనుక ఒకే సారి పెద్దపెద్ద అడుగులు వెయ్యడం కాక చిన్న చిన్న అడుగులతో లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చెయ్యగలము అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. గురువులకి శిష్యుని సామర్థ్యమెంతో తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు గురువుగారితో పాటు కూర్చుని జపం చేసే అలవాటు చేసుకోవాలి. వచ్చే సందేహాలను నివృత్తి చెసుకుంటూ ముందుకు సాగాలి.

౪) ఇక మంత్రము ఒక దేవత లేదా గురువు ఉపదేశిస్తున్నట్లుగా కర్ణములకు ( చెవులకు ) వినపడడం ఉత్తమం జపం. ఈ స్థితి కలగడానికి చాలా సాధన కావాలి.  కొంతమందికి కలలో కొన్ని మంత్రాలు ఉపదేశం ఇవ్వబడతాయి. వాటిని సాధన చెయ్యడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలరు. ఇక నిత్య జీవనంలో కూడా ఏపని చేస్తున్నా ఒక స్వరం చెవిలో మంత్రాన్ని వినిపిస్తూ ఉండడం జపం పూర్ణత్వం పొందడాన్ని సూచిస్తుంది. రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి వంటి వారికి ఇది సాధ్యమైనది.  ఈ స్థితిలో అనేక శక్తులు సాధకుని వశమౌతాయి. అణిమాద్యష్ఠసిద్ధులు సాధకుని లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అనేక విధాల ప్రలోభపెడతాయి.  వాటికి లొంగితే తరువాతి స్థితి ఏమిటన్నది తెలియదు. సాధన అక్కడితో ఆగిపోయి సాధకుడు లౌకిక వ్యామోహాలలో పడతాడు. అనేక విధాల భ్రష్ఠుడౌతాడు. వాటికి లొంగక ఉపాస్యదేవతనే ఆశ్రయించినవారు జీవైక్యస్థితిని పొందుతున్నారు.

మంత్రము - ఉపాస్య దేవత - ఉపాసకుడు వేరువేరు అనేస్థితిలో మొదలైన ఈ ప్రయాణం ఆమూడూ ఐక్యమై ఒకటే శక్తి గా రూపొందడంతో పరిపూర్ణమౌతుంది.


పైవిషయాలన్నీ గమనించిన మీదట కొన్ని విషయాలు తెలుస్తాయి.

౧) మొదట గురువు వద్ద  మంత్ర దీక్షను పూని వారి సమక్షములో కొంత సాధన చెసిన తరువాత స్వయముగా ప్రయత్నించాలి.

౨) మూడవస్థితి ప్రారంభకులకు మొదట సంఖ్యానిర్ణయముతో గాక మానసిక నిశ్చలమును బట్టి సమయ నిర్ణయము ఉత్తమము. అంటే "మనసు నిలచినంత సమయము జపం చెయ్యాలి" అనే సంకల్పముతో మానసిక జపమును ( పునశ్చరణ) చెయ్యాలి.  క్రమముగా నూటఎనిమిదిసార్లు, మూడువందలు, ఐదువందలు వెయ్యి అని సంఖ్యా నిర్ణయముతో సాధన చెయ్యాలి.

౩) సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు. మనసు పదేపదే వేరే విషయాలమీదకి వెళుతున్నది కదా అని నీరుగారిపోక మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషంమీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత  స్థిరమైన సంకల్పం ఉన్నట్లు. మళ్ళిన మనసుని తీసుకువచ్చి మళ్లీ మంత్రం గుర్తుకు తెచ్చుకోవడం మీద పెట్టాలి. ఆ మంత్రము యొక్క అర్థము మీద దృష్టి నిలపాలి. ఆ మంత్ర అధిష్ఠాన దేవతను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. కనుక పట్టువదలని సాధన మాత్రమే మీ జీవితాన్ని తరింపచెయ్యగలదు.

ఇంకనూ అనేక విషయాలు ఉన్నవి. కానీ కొన్ని మాత్రమే తెలపగలం. కొన్ని ఎవరికి వారు సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. 



సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు!

15, డిసెంబర్ 2010, బుధవారం

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?


బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు "భూసురుడు" అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.

ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.

౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము

ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికము
లు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి.

అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె


మరింత వివరంగా త్వరలో రాసేప్రయత్నం చేస్తాను.

22, జనవరి 2010, శుక్రవారం

పూజలలో కొబ్బరికాయ విశిష్టత ఏమిటి? మరికొన్ని ప్రశ్నలు.


మన హిందు సాంప్రదాయంలో పూజ అంటే ముందుగా కావలసినది కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టకుండా చేసే పూజ అసలు సంతృప్తిని ఇచ్చినట్టే ఉండదు. అంతగా పూజకు కొబ్బరికాయకు మనకు ఆత్మీయత కుదిరిపోయింది. అటువంటి కొబ్బరికాయకు సంబంధించిన సందేహాలు ఇక్కడ చర్చించుకుందాము.

1.కొబ్బరికాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

కొబ్బరికాయకు మనకు పోలిక ఉంది. కొబ్బరికాయ పైన ఉన్న దళసరి పెంకు మన అహంకారానికి, లోపలి కొబ్బరి మన మనస్సుకూ ప్రతీకలు. కొబ్బరికాయ కొట్టడమంటే మన అహంకారాన్ని విడనాడి, ఆతెల్లని కొబ్బరి లాంటి మన మనస్సును స్వామి ముందు పరచామనీ ఆ మనస్సును ( కొబ్బరిని ) స్వీకరించి నిర్మలమైన కొబ్బరి నీరు లాంటి జీవితమును ప్రసాదించమనీ అర్థం అందులో ఉంది. అందుకే కొబ్బరికాయ మన పూజలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
2. పీచు తీసిన కొబ్బరికాయను కొట్ట కూడదా?

మన శరీరానికి చర్మం ఎంత అవసరమో, కొబ్బరికాయకు పీచూ అంతే అవసరము. ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు. కొట్టినతరువాత తీయాలి. కొబ్బరికాయ మొదలులో ఉన్న 3 కన్నాల దగ్గరా చిప్ప కాస్త మెత్తగా ఉంటుంది. ముందరే పీచుతీయడం వలన ఆ కన్నాల ద్వారా బాక్టీరియా కాయలోనికి త్వరగా ప్రవేశించి కాయ పాడయిపోయే అవకాశం ఉంది. ( మీరు గమనించే ఉంటారు కొబ్బరి కాయ కుళ్లడం అంటూ జరిగితే అది మొదలు నుండే జరుగుతుంది. లేదా కొబ్బరికాయకు పగులు వస్తే ఆ పగులు వద్ద కుళ్లుతుంది. ) కనుక ముందు పీచుతీయకూడదు అంటారు.

3. మరి కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీయాలి?

కొబ్బరికాయను దేమునికి ప్రసాదంగా పెడుతున్నాము. ఆ ప్రసాదంగా పెట్టే కొబ్బరికాయ బాగుందో లేదో చూచుకుని పెట్టాలి కదా!? కానీ వాసన చూడకూడదు, రుచి చూడకూడదు ( దేముని ప్రసాదం కనుక ) . మరి వాసన చూడకుండా, రుచి చూడకుండా కొబ్బరికాయ బాగుందో పాడైపోయిందో ఎలా తెలుసుకోవడం? కొన్ని సార్లు కంటికి బానే ఉన్నట్టు కనబడినా రుచి చూసిన తరువాత పాడయి పోయిందని తెలుస్తుంది. అలా పాడయి పోయిన కాయను తెలుసుకోవడం ఎలా? దానికోసమే కొబ్బరికాయ వెనకాల పీచుతీసి మూడు కన్నాల వద్ద నొక్కి చూడాలి. ఎక్కడైనా మెత్తగా నొక్కు బడితే అది పాడయి పోయిందని అర్థం. అలా నొక్కు బడక మామూలుగా ఉంటే బాగుందని. ఆవిధంగా కంటికి కనబడని కొబ్బరికాయలోని లోపాన్ని కూడా తెలుసుకోవడానికే కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు తీయాలి.


4. కొబ్బరి కాయకు పసుపు కుంకుమ రాయడం సబబేనా?

పసుపు, దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి. వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒకవిధంగా సబబే. అందువలన ఆ కాయచుట్టూ ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి. కానీ కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఎంత మాత్రమూ సరిఅయినది కాదు. మనం భగవంతుడు వచ్చాడు అని నమ్మి అతనకి పూజ చేస్తాము. ఆ విధంగా మన ఇంటికి వచ్చిన భగవంతునికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యముగా ఈ కొబ్బరిని సమర్పిస్తున్నాము. అంటే మన ఇంటికి ఒక అథిధిని పిలిచి ఫలహారం పెట్టడం లాంటిది. మనం కొబ్బరి తింటే, లేదా వచ్చిన అథిధికి పెడితే కుంకుమా పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా!? కుంకుమ ఉంటే కడుక్కుని మరీ తింటాము. మరి అలాంటాప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమా పసుపూ చల్లి పెట్టడం తప్పేకదా!? :) ఇదే కాదు మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనదీ తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి.


నాకు సహజంగా పూజలలో ఎదురయ్యే సందేహాలను ఈ "పూజలు-కొన్ని సందేహాలు" అనే లేబుల్ లో రాస్తున్నాను. పూజ్యులైన పెద్దలు తమకు తెలిసిన సమాధానాలను కూడా ఇక్కడ వ్యాఖ్యలలో తెలుప వలసిందిగా మనవి. అలాగే పూజలు చేసే ప్రతీ ఒక్కరూ మీకు సహజంగా పూజలు చేసే టప్పుడు వచ్చే సందేహాలు ఏమైనా ఉంటే నన్ను ఈ బ్లాగు ముఖంగా అడిగితే నాకు తెలిసినంత వరకూ చెప్తాను. తెలియనివి తెలుసుకోవడనికి కూడా ప్రయత్నిస్తాను.

ధన్యవాదాలు.

4, జనవరి 2010, సోమవారం

మాంసాహారం తినడం అధర్మమా?

నేడు శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. మాంసాహారులు అనారోగ్యం పేరుతో శాకాహారులవుతున్నారు.

శాకా హారులుగానే ఉందామనుకునే నిర్ణయమున్న వారికి బయటకెళ్లి తినటం అనేది జటిలంగా మరుతోంది. ఎక్కడ చూసినా మాంసాహార శాలలే కనిపిస్తున్నాయి. కాలేజీ ర్యాగింగులలో శాకాహారి అనేవాడు కనబడితే వాడు మాంసం ముట్టేదాకా వెధిస్తారు. ( ఈ స్థితి ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు మందు, సిగరెట్, అమ్మాయిలు ఈ విషయాలలో సీనియర్స్ జూనియర్స్ కి వద్దుమొర్రో అన్నా నెర్పిస్తున్నారు. ) మనసులో శాకాహరిగా ఉందామని ఉన్నా చుట్టూ ఉన్న అనేక పరిస్థుతుల వల్లో, చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది మాంసాహారులే ఉండడం వల్లో, జిహ్వ చాపల్యం వల్లో, ప్రలోభం వల్లో నేడు శాకాహారులందరూ మాంసాహారులవుతున్నారు. గుడ్డు మాంసాహారం కాదని దానిని శాకాహారంలో కలిపెసిన వారూ ఉన్నారు.

ఇటువంటి సందర్భంలో శాకాహారిగా జీవించడం ప్రశ్నార్థకమవుతున్నది.అసలు ఇంత కష్ట పడి శకాహారిగా జీవించడం అవసరమా? అసలెందుకు శాకా హారిగా జీవించాలి? మాంసాహారం తింటే ఏమిటి నష్టం? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అలాగే మాంసాహారులు కూడా శాకాహారుల ప్రభావంతో ఆలోచనలో పడుతున్నారు. మాంసాహారులుగా ఉండడం మంచిదా? శాకాహారులుగా ఉండడం మంచిదా? అనే ప్రశ్నలు ఏదో ఒక సందర్భంలో రాకమానవు. మాంసాహారం మానలేక శాకాహారానికి రాలేక తాముచేసేది తప్పు అనే ఉద్దేశంలో సతమత మయ్యే వారూ ఉండవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో శాకాహారులకు, మాంసాహారులకు అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అని. ఇదే విషయం నేనాలోచిస్తే ఏది ధర్మం, ఏది అధర్మం అని ఆలోచిస్తాను. రెండిటికీ తేడా ఏమిటీ? అనుకోకండి. చాలా తేడా ఉంది. మొదటి రకంగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలకు ఈ ధర్మాధర్మ విచక్షణ ద్వారా చాలా సులభంగా దొరుకుతుంది.

నాకో సందేహం ఈ శాకాహరం అనేది మనమే పాటిస్తున్నామా? మొదటి నుడీ శాకాహారాన్నే నియమంగా పెట్టుకుని ఉన్న శాఖలు/తెగలు ఇతర దేశాలలో ఏమైనా ఉన్నాయా?

ఇక మన విషయానికి వస్తే ఆహారం కోసం ఒక దానిపై మరికటి ఆధార పడడం ప్రకృతి ధర్మం. ఆహారం కోసం చెట్లపై ఆధారపడడం ఎంత సహజమో, జంతువులపై ఆధారపడడమూ అంతే సహజం. పూర్వ కాలంలో అందరూ మాంసాహారం తినేవారని పూరాణేతిహాసాల వలన తెలుస్తోంది. వశిష్టుడు మొదలైన వారికి శ్రాద్ధాది క్రతువులలో మధువు, మాంసాహారం ( మేక మాంసం ) పెట్టేవారు. సోమయాగంలో( ఆ సోమయాగం చేసినవారిని మత్రమే సోమయజి అనే వారు. ఇప్పుడు అందరూ అపేరు పెట్టుకుంటున్నారు. ) ఆ విధంగా చూస్తే మాంసాహారం తినడం అధర్మమేమీ కాదు.

అయితే మాంసాహరం తినవచ్చా? అంటే తినవచ్చు. మరి కొందరు ఎందుకు నిషద్ధం చేశారు?
ఇదే అందరూ ఆలొచించ వలసిన విషయం. మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు అని ప్రశ్నించుకుంటే ఆ మాంసాహారాన్ని తినడం వలన రజో గుణం ఎక్కువ అవుతుంది. ( ఇదే కారణంతో కలియుగంలో బాహ్మలు, గురువులు మధుమాంసాలు తినరాదని శుక్రాచార్యుడు శపించాడు. ) శాకాహారం సాత్విక లక్షణాలు పెరుగుతాయి. ఈ రజోగుణం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత చేటు. సాత్విక గుణం మనల్ని ధర్మాధర్మ విచక్షణ చేసే స్థితిలో ఉంచి ఙ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.

అంటే మాంసం తినేవారికి ఈ సాత్విక గుణం లేదనా? ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. కానీ దాని పాళ్ల ( levels ) లో తేడా ఉంటుంది. అలాగే శాకాహారం తినే వారిలో పూర్తిగా సాత్విక గుణాలు ఉంటాయనుకోవడం కూడా అపోహే అవుతుంది. ఎందుకంటే వారు రజోగుణానికి ఇతర కారకాలైన మద్యము, గుట్కా, జరదా, గంజాయి, ఉల్లిపాయలు ఇంకా అనేకమైనవి సేవిస్తూ ఉండవచ్చు. కనుక ఈ రజోగుణం ఎక్కువగా కలగకుండా ఉండటం కోసం మాత్రమే ఇటువంటివి మానేయవలసిన అవసరం ఉంది.

బ్రాహ్మలు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండే వారు. నలుగురికీ ఙ్ఞాన మార్గం బోధించ వలెను కనుక వారికి ఇటువంటివి నిషేధించడమైనది. అందువలన వారు ఎక్కువ సాత్విక ప్రవృత్తి ( positive attitude ) కలిగి ఉండి ఙ్ఞానాన్వేషకులై జీవించేవారు. ఇప్పటికీ సాత్వికాహారం తినేవారు చాలా మంచి గుణాలు కలిగి ఉండడం మీరు గమనించ వచ్చు.

ఇది నా దృష్టి కోణం మాత్రమే. ఇంకా చాలా విషయాలు వ్యాఖ్యల రూపంలో వస్తాయి. అవన్నీ చదివి ఏది సమంజసమో మీరే నిర్ణయించుకోండి.

30, డిసెంబర్ 2009, బుధవారం

మూఢనమ్మకాలు

రహమతుల్లా గారు నా ఆస్తిక-నాస్తిక వాదన అనే టపాకు వ్యాఖ్యగా మూఢనమ్మకాలపై మంచి విషయాలు ప్రస్థావించారు. అక్కడ వెంటనే ప్రచురింప బడక పోవడం వల్లననుకుంటా నా క్రితం టపా కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా? అనే టపాలో కూడా వ్యాఖ్యగా రాశారు.

ఇక వారు ప్రస్థావించిన అన్ని విషయాలనూ నాకు నేను ప్రశ్నించుకుంటే వాటికి ఏ సమాధానాలు ఇచ్చుకుంటానో వాటిని ఇక్కడ తెలియజేస్తాను. అవి చాలా మందికి కలిగే సందేహాలు కనుక ఈ టపా అందరికీ ఉపయోగ పడవచ్చు.

ఇక వరుసగా ఆ విషయాలు ( ప్రశ్నలు )చూద్దాం.


1* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం

ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా చూస్తేకానీ ఏమీ స్పందించలేను. ఎందుకంటే ఇక్కడ ఒకరి ఎంగిలి ఒకరు ఎంతో మక్కువతో తింటున్న ప్రజలను చూస్తున్నాను. హోటళ్లలో అయితే అది శాఖాహారమా, మాంసాహారమా అని కూడా ఆలోచించటం లెదెవరూ. చక్కగా చికెన్ తో ఏదో వేపుడు చేసిన మూకుడు లోనే, నూడుల్స్ వేయిస్తాడు. జనాలు అవి ఆవురావురుమని తింటున్నారు . దీనిని చూసిన నాకు అదేమీ అంత పెద్ద పైత్యమనిపించడంలేదు. కానీ ప్రత్యక్షంగా చూస్తే మరోలా అనిపించవచ్చునేమో.

2* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఇది ఆచరించవలసిన విధానమే. దేవాలయం అంత విశాల ప్రాంగణంలో కట్టాలి అని తెలియజేయడానికి ఇది సంకేతం. మన ఇల్లు కట్టినట్టు చిన్న చిన్న స్థలాలలో దేవాలయాలు కట్టకూడదు. వంటిల్లు, హాలు ఒకేలా కట్టము కదా? అలగే దేవాలయాన్ని ఎలా నిర్మించాలి అనే విషయంలో కొన్ని విధనాలు పాఠించాలి మనం.

3* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.

ఇది నిజంగా మూఢనమ్మకమే. ఇది తప్పక ఖండించాలి.

4* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.

ఇది నేను ఇదివరకు వినలేదు. గ్రామ వాతావరణంలో అది సబబేనేమో.. ఆ జాతరలు జరిగే రోజులు అంటు వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో వస్తాయా? అలా అయితే అది సమంజసమే కదా? శుభకార్యాల పేరుతో జనాలు ఎక్కువగా ఒక్కచోట చేరటం వల్ల అవి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా? పూర్వం గ్రామాల్లో నే కాదు పట్టణాల్లో కూడా ఈ వ్యాధులకు ఎంతో మంది బలైపోయేవారు. అందుకే అటువంటి నమ్మకం ఏర్పరచుకుని ఉంటారు. అది మంచిదే అనిపిస్తోంది.


5* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.

అవునా? నాకు ఈ విషయం తెలియదు. ఏదీ సరిగా తెలియకుండా వ్యాఖ్యానించడం అంత సబబుకాదు. అందుకే నేనేమీ చెప్పలేను.

6* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

ఇది దారుణం. చేత బడుల గురించి వినడమే గానీ , నిజంగా చూడలేదు.అయితే చేతబడులు లేవని నేను నమ్మలేను. అది ఒక హిప్నాటిజం లాంటిది.పూజలు అనేవి మానసిక బలాన్ని పెంచగలవని నమ్ముతాను.అలాగే చేతబడులు మానసికంగా కృశింపచేయడానికి ఉపయోగ పడతాయేమో అనుకుంటున్నాను. కానీ నేడు అంత దీక్షగా చేయగలిగే వారెంతమందీ అన్నదే సందేహం.

7* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.

ఇది ఖచ్చితంగా మూఢనమ్మకం. ఆ పూజారి ప్రజల బలహీనతలతో బ్రతుకుతున్నాడని చెప్పగలను.


8* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఆ సమయంలో ప్రకృతి శక్తులు అంతగా పనిచెయ్యవు. ఆకాశంలో జరిగే క్రియలు మన దేహంపై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నది నేను నమ్ముతాను. చంద్రుడి వెన్నెల మనసుకు ఎలా ఆనందాన్నిస్తుందో, సూర్యుడి వేడి దేహానికి తాపాన్ని ఎలా కలుగజేస్తున్నదో అలాగే ఆ గ్రహణ సమయంలో కూడా మన దేహం ( ఈ ప్రకృతి మొత్తం ) దాని ప్రభావానికి లోనవుతుంది. వేసవి కాలంలో పల్చని వస్త్రాలు ధరించాలి. సీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరించాలి. అలా అని అది నియమం కాదు. ధరించక పోతే ఏమౌతుంది? ఆ బాధను భరించవలసి ఉంటుంది. అలాగే ఈ గ్రహణ సమయంలో భోజనాదులు కూడా నిషిద్ధం. అలా చేయటం చేయక పోవడం వారి వారి నమ్మకం మీద ఉంటుంది.

అన్నీ కంటికి కనపడవు. కొన్ని కంటికి కనిపిస్తే , కొన్ని బుద్ధికి తడతాయి మరి కొన్ని మనసుకు గోచరిస్తాయి. వేటి కీ అందక పోయినా అవి అసత్యాలని కాదు. ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలియాలంటే నిరంతర వినయంతో కూడిన, తప్పును సరిదిద్దుకోగలిగిన వివేచన మాత్రమే మనకు దారి.

9* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.

ఇక కొన్ని ఇలాంటి నమ్మకాలు కొంత సత్యానికి , కొంత కల్పన చేర్చి మరింత చేసి మసి పూసి మారేడు కాయ చేసినవన్నమాట. నాకు సరిగ్గా తెలియదు కానీ తుమ్మగానే మనలో రక్త ప్రసరణ స్తంభించడం, గుండె ఆగడం వంటివేవో అనేక మార్పులు జరుగుతాయట. ఇది సైంటిఫిక్ రీజన్. అందు వలన ఓ క్షణం ఆగి ఏ పనైనా ప్రారంభించమనడం వరకూ నేను ఆచరిస్తాను. ఇక మన తప్పును ఎవరి తుమ్ముపైనో రుద్ధడం అనేది చేతకాని తనం.

10* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.

కన్యా దానం అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది కానీ, ఇలా కాదు సరైన వరునికి దానమివ్వమని చెప్పారు. తద్వారా వారికి సంతానం కలిగి వంశ అభివృద్ధి జరుగుతుంది. ఆ పుట్టిన వారు పితృకర్మలు చేస్తే వీరికి పుణ్యగతులు కలుగుతాయి. అందుకోసం కన్యాదానం చెయ్యమన్నారు. కానీ అది ఇలా వదిలించుకోవడంగా రూపుమారడం శోచనీయం.

11* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.

ఆవుకు మనిషి పుట్టడం నిజంగా జరిగిందా? ఒక వేళ జరిగితే దీపాలు వెలిగించడం అనేది ఓవిధంగా మంచిదే. ఈ విషయం వల్ల నిరూపణవుతున్నదేమిటీ----? మనిషికి కామం మితిమీరిందన్నది తెలుస్తున్నదికదా? ఆ కామాన్ని అదుపులో పెట్టు నాయనా అని ఎవరికి చెప్పాలి. అందరూ పశుప్రవృత్తినుండి, మానవ ప్రవృత్తికి రావాలి ( మనలో చాలా వరకూ పశు ప్రవృత్తి ప్రబలుతోంది అన్నది అందరూ అంగీకరించని నిజం ). అలా రావాలంటే ఈ పూజలూ మొదలైనవి చాలా సహాయపడతాయి. పైగా ఇవి లోకక్షేమంకోరి చేస్తున్నామంటే మరింత త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువ. ( తను బాగుపడడానికి ఎంతో బద్ధకించే వాళ్లు ఎంత ఎక్కువ మంది ఉన్నారో..., లోక కళ్యాణం కోసం అనగానే అందరికంటే శ్రద్ధగా చేసేవాళ్లు అంతకంటే ఎక్కువమంది నేడు ఉన్నారన్నది కూడా పచ్చి నిజం . అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను పూజలు చేయించే చోట్ల చాలా మందికి చెప్తాను. మీరు ఇలా రోజూ దీపారాదనచెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అంటే వినేవాళ్లు తక్కువే. కానీ నేను లోక క్షేమంకోరి ఓ యాగం చేస్తున్నాను. మీరు వచ్చి తప్పక పాల్గొనాలి అని పిలిచినదే తడవు నాకు అనేక విధాలు సాయపడ్డవారు చాలామంది ఉన్నారు. ) ఈ విధంగా ఆలోచిస్తే ఈ దీపాలు వెలిగించడం అనేది అనాలోచితమైన పని కాదు. ఎంతో ఆలోచించి ఓ మహాను భావుడెవరో ప్రవేశపెట్టిన ఓ పథకం.

ఈ పని ఇలా జరగడమే ఉత్తమం కూడా. మన నేతలలో ఎవరో చాలా పెద్ద కుంభకోణాలలో ఉన్నారనుకోండి. అది ప్రత్యక్షంగావెలుగు చూపితే వచ్చే మంచి కంటే చెడే ఎక్కువ. లోపల వారిని శిక్షించి పైకి మరొ విధమైన రూల్ ని పాస్ చెయ్యడమే తెలివైన ప్రభుత్వం చేసే పని. తద్వారా ప్రజలకు అభద్రతా భావం ఏర్పడకుండా ఉంటుంది. అటువంటిదే ఈ పని కూడా.


12* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

వాటి ప్రాశస్త్యం ఏమిటో నాకైతే తెలియదు. ఇలాంటివి గ్రామాలలో ఇంతలా ఎలా పెరుగుతున్నాయో ఓసారి ఆలోచించాలి. కోరికలు పెరగడమే ఈ నమ్మకాలు పరాకాష్టకు రావడానికి కారణంగా తోస్తోంది. ఏదైనా అతి పనికి రాదు.

13* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.[1]

ఇది ఓ పిచ్చి లాంటిదే. ఆ డబ్బును బీదప్రజలకు దానంగా ఇస్తే ఎన్ని కుటుంబాలకు తిండీ గుడ్డా అందుతాయో కదా..? :(

14* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm


ఇటువంటి వ్యక్తులను ఎలానమ్ముతారో ప్రజలు. ఇటువంటి దొంగ బాబాలను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి ప్రభుత్వం.


15* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.

కేరళ జ్యోతీష్యాన్ని గురించిన పూర్తి వివరాలు నాకు తెలియదు. నా వరకూ జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది మనం కష్టంలో ఉన్నప్పుడు చుక్కానిలా పనిచేస్తుంది. ఏదారీ తోచని వారికి ఓ వెలుగు బాట చూపుతుంది. కానీ ఎల్లప్పుడూ ఆ జ్యోతీష్యం అవసరం లేదు. మీరు ఎవరూ తీర్చలేని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఆధారపడండి అని అందరికీ చెప్తుంటాను.


16* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.

వీటి విషయంలో కూడా ఉన్నదానికంటే ఎక్కువ ప్రచారం జరిగింది. దీనికి ముఖ్యకారకులు రాళ్ల వ్యాపారులు. జ్యోతీష్యులను పావులుగా చేసి జనాల బలహీనతలతో ఆటలాడారు/ఆడుతున్నారు.

జనాలు కూడా అమాయకులై ధరించడం లేదు. నేను ఇన్ని వేల రత్నాన్ని ధరించాను అని చెప్పుకోవడం ఓ గౌరవం, ఓ దర్జా అయిపోయిందిప్పుడు. నేను ఎవ్వరికీ రాళ్లు పెట్టుకోమని చెప్పను. ఒకవేళ పెట్టు కుంటమన్నా దానికి వేలకు వేలు ఖర్చుపెట్టవద్దు అని ఖచ్చితమైన సలహా ఇస్తాను. దానికంటే రోజూ ఇంట్లో దీపారాధన చెయ్యడం వెయ్యిరెట్లు మంచిది. కానీ జనాలకు శ్రమలేకుండా, పనయ్యే మార్గం కావాలి. దానికి ఎంతైనా ఖర్చుపెడుతున్నారు.

17* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట

చీము,నెత్తురుతో జుగుప్సాకరంగా ఉండే వైతరిణీ నదిని దాటవలెనంటే గోదానం చెయ్యాలి. ఆ గోదాన మహిమ వల్ల దానిని దాటగల శక్తి వస్తుంది.

గోదానానికే ఎందుకంత ప్రశస్తి కలిగింది? అంటే దీనికే కాదు (పైన 10 లో చెప్పినట్టు) ఇంకా అనేక దానాలకు కూడా చాలా గొప్పదనం కలదని చెప్పారు మన పెద్దలు. ఇక్కడ ముందు ఆలోచించ వలసింది గోదానం గొప్పేమిటని కాదు. దానం గొప్పేమిటని?

పూర్వం ధనాన్ని గోవులతో కొలిచే వారు. అంటే అతనికి ఎంత గోసంపద ఉంటే అంత ధనవంతుడన్నమాట. అలాగే ఈ గోపోషణ అనేది పరమ ఉత్తమమైన పనిగా ఎంచబడేది. అలాగే ఈ వైతరిణీ నది అంటే మరేదో కాదు మన జీవితమే అనేక పాపాలతో కూడుకున్న జుగుప్సాకరమైన వైతరిణీ నదికి సంకేతం. ఈ విధంగా పోల్చుకుంటే

మన జీవితాన్ని సునాయాసంగా దాటడానికి దానం అనేది పరమ సాధనంగా ఉపయోగ పడుతుంది. అంటే మనం సంపాదించినది పరోపకారార్థం ఏకోరికాలేకుండా దానం చేయగలిగిన నాడు ఆ జీవితం సుఖదుఃఖాలకు అతీతంగా ఆనందడోలికల్లో తేలిపోతుంది.

హిందూ సాంప్రదాయంలో ( హిందూ అనే కాదు చాలా సాంప్రదాయాలలో ) ఉన్న నిగూఢార్థం అర్థమవ్వాలంటే ఎంతో తపన ఉండాలి. సత్యమునే పలకండి అని అన్ని మతాలు చెప్తున్నాయి. ఆసత్యాన్నే ఎందుకు పలకాలి ? అలా పలికితే మనకు మంచి ఎలా జరుగుతుంది? పలకక పోతే పాపమెలా కలుగుతుంది? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుంటే దాని పూర్వాపరాలు తెలుస్తాయి. దీనికి చక్కని ఉదాహరణ మన చిన్నప్పుడు చదివిన " నాన్నా పులి" అనే గొర్రెలు కాచే పిల్లవాడి కథ . ఇలాంటి అనేక కథల ప్రభావమో, జీవితానుభవమో మొత్తానికి సత్యాచరణం మంచిదని ఒప్పుకోవడానికి చాలా మందికి అభ్యంతరమేమీ లేదు. కానీ ఇలాంటి కొన్ని ధర్మాలను ఒప్పుకోవడానికి అనేక సంశయాలు వేధిస్తుంటాయి. దానికి వినయంతో కూడిన అన్వేషణే మార్గం.


మన బుద్ధికి,ఊహకు అందని / సమంజసమనిపించని చాలా విషయాలను మనం ముఢనమ్మకాలుగా చెప్తాం. కానీ మనకు తెలిసినవే సమగ్రమైనవి, సరిఅయినవి అనే అభిప్రాయం సరి కాదు. నాకు లేదు. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. మీకు నచ్చితే మరికాస్త ఆలోచించండి. లేదంటే మరల ప్రశ్నించండి. :)

15, డిసెంబర్ 2009, మంగళవారం

కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా?


"కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి" ఏదేవాలయానికి వెళ్లినా సాధారణంగా దేముడి కంటే ముందుగా పెద్దపెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఈ బోర్డు. కొన్ని దేవాలయాలలో ఉండదు. అంటే అవి ఈ మధ్యే కట్టిన దేవాలయాలు అని తెలుసుకోవచ్చు. ఆ దేవాలయ కమిటీ వారికి ప్రజలనుండి సంపాదించే మార్గాలు ఇంకా పూర్తిగా తెలియలేదు అని అర్థం. అలా అని ఎల్లకాలం అలానే ఉండరండీ. త్వరలోనే వారికి కాస్తో కూస్తో భగవంతుడిమీద ఉన్న భక్తి కాస్తా, ధనం మీదకి మళ్లు తుంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎవరినుండి ఎంత ఎలా చందాగా పోందవచ్చు? ఈ చందాలు కాకుండా ధనాన్ని కూడ కట్టడానికి ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయి? అనే అన్వేషణ మొదలవుతుంది ధర్మకర్తలలో. ఇక ఆక్రమంలో ఈ బోర్డు వచ్చేస్తుంది. ఇది సాధారణమైపోయింది ఈమద్య దేవాలయాలలో.

భక్తులు హుండీలో మాత్రమే కానుకలు వేయాలి అని బోర్డు పెట్టడంలో ఆంతర్యం. భక్తులు కానుకలు హుండీలో కాక మరెక్కడ వేస్తున్నారు. ఎక్కడవేస్తారు? అర్చకునికి దక్షిణగా ఇస్తారు. ఇదే ఇదే ఇక్కడే చిక్కంతా. మరి దేవాలయం వారిచ్చే వెయ్యి, రెండు వేలు కాకుండా? వారిచ్చే ఓ స్టోర్ రూములాంటి వసతి గది కాకుండా ఇంకా ఆ అర్చకుడు పై ఆదాయం సంపాదించుకుంటుంటే దేవాలయం ఏమైపోవాలి? దాని అభివృద్ధి ఎమైపోవాలి? అర్చకుడు అభివృద్ధి చెందితే సరిపోతుందా? గుడి గురించి ఎవరు పట్టించుకుంటారు? అని ధర్మకర్తలు తెగ మథనపడి ఇలాంటి ధర్మ నిర్ణయం తీసుకుంటారన్నమాట.

అసలు ఇది ఎంత వరకు సమంజసం. చందాల ద్వారా గుడిని అభివృద్ధి పరచాలనుకోవడం కొంతవరకూ సమంజసం. ఇది కూడా ఓ విధంగా చేతకాని తనమే.
పూర్వకాలంలో రాజులు, లేదా గ్రామ పెద్దలు దేవాలయాలు నిర్మించే వారు. వారికి ధనానికి కొరతేమిటి? దేవాలయ నిర్మాణం ఖర్చులన్నీ ఒక్కరే భరించే వారు. గుడి కట్టిన తరువాత దాని పోషణకు కావలసిన ధనాన్ని ,అర్చకుని జీవనానికి కావలసిన ధనాన్ని కూడా వారే ఇచ్చేవారు. ఇందుకోసమే ఒక్కో దేవాలయానికీ కొన్ని వందల ఎకరాల భూములను రాసిచ్చే వారు. ఆ భూములలో పండిన పంటల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ఖర్చులన్నీ నడిచేవి.

కాలం మారింది. తరువాతి కాలంలో ప్రభుత్వాలు ఆ భూములను ఎలా స్వాధీన పరుచుకున్నాయో,అర్చకులకు ఏ మాత్రం మిగిల్చాయో అదంతా జగద్విదితమే.
మరి నేడు కొత్త గా కట్టే దేవాలయాల సంగతి ఏమిటి? దేవాలయాలు ఎందుకు కడుతున్నారు? చాలా చోట్ల నేడు భూములు అన్యాక్రాంతమవకుండా, దానిమీద కొంత పెత్తనం చెలాయించడానికి దేవాలయాలు కడుతున్నారు. కట్టే వారు వారిధనంతో కట్టేంత ఉద్దాత్త హృదయం ఉండదు ( ఒక వేళ వారి వద్ద ఓ దేవాలయం నిర్మించ గలిగే ధనం ఉన్నా సరే ). అందరివద్దా చందాలు వసూలు చేయాలి. దానీ లో వీరిదీ ఓ 5% వాటా ఉంటుంది . అంతకూడా ఉండదు. మొత్తానికి వారిచిన్న ధనంతోనూ , వీరిచ్చిన ధనంతోనూ దేవాలయం పూర్తిచేస్తారు. మరి గుడి కట్ట గానే కళ్యాణ మవుతుందా? దానికి ఓ అర్చకుని నియమించాలి. అతనికి జీతం సమకూర్చాలి. మరి నిత్యం ఓ కొబ్బరికాయ కొట్టాలన్నా ఖర్చు ఉంటుంది కదా? దీపారాధనకు నల్ల నువ్వుల నూనె ఎంత ప్రియం అయిపోయిందో. ఆ ఖర్చులన్నీ ఎలా? మళ్లీ చందాలకోసం ఎదురు చూపులు. గుడి కడుతున్నామంటే ఏదో చందా ఇస్తారు కానీ. నిత్య ఖర్చులకు అంతగా ఎవరూ చందా ఇవ్వడానికి ముందుకు రారు. కొంత కాలం ఎదో తప్పదనుకుంటూ ఖర్చు పెడతారు మన ధర్మకర్తలు. కానీ అది ఎంతోకాలం సాగదు. మొత్తం సంపాదించిన డబ్బులన్నీ గుడికే ఖర్చుపెడితే ఇంట్లో ఆడవాళ్లు గరిటలు తిరగేస్తారు మరి. దానితో ధర్మ కర్తల దృష్టి అర్చకుని ఆదాయం మీద పడుతుంది. రోజూ వచ్చే భక్తులు ఏవొ పూజలు చేయించుకుని ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుంటూ ఉంటారు. ఆ ఆదాయంతో అర్చకుడు తెగసంపాదించేస్తున్నాడని వీరికి మనసులో ఆవేదన మొదలవుతుంది. దాని ఫలితమే ఇదంతా?

కొంతమంది దేవాలయాన్ని పూర్తిగా తమఖర్చుతో కట్టించే ధర్మక్ర్తలూ ఉన్నారు. తరువాతి కాలంలో ఖర్చులు కూడా వారే భరిస్తారు. కానీ అర్చకుని ఆదాయం వద్దకు వచ్చేసరికి ఒకరకమైన బాధ మొదలవుతుంది. అతని ఆదాయానికి, తమ హుండీ ఆదాయానికీ పోలిక మొదలవుతుంది. నెమ్మదిగా పైన చెప్పిన బోర్డు వస్తుంది. కుదరదని వ్యతిరేకించిన అర్చకుడు తొలగించ బడి ఓ కొత్త అర్చకుడు వస్తాడు.( ఆ వచ్చే అర్చకుడు ఎందుకు వస్తాడో తెలుసా. అతనికి ఆ గుడి వారిచ్చే వెయ్యా, రెండు వేలు కూడా గతిలెదు కనుక. )

ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి. అసలు వచ్చే భక్తులు కానుకలు వేసే ఆచారం ఎందుకు వచ్చింది?
1. అర్చకుని చేత పూజ చేయించుకున్న తరువాత అతనికి దక్షణ సమర్పించే ఆచారం ఎప్పటి నుండో వున్నది. అది ఎందుకో తెలుసా? మన హిందూ వ్యస్థను ప్రధానంగ 4 వర్ణాలు గా విభజించారు. ఒక్కో వర్ణానికీ ఒక్కో బాధ్యత అప్ప గించబడింది. బ్రాహ్మలు వేదవిద్యను అభ్యసించి, అందు గల ధర్మాలను నలుగురికీ తెలియచెప్పాలి. క్షత్రియులు ఆ వేద ధర్మాన్ని అందరూ అనుసరించే టట్టు చూడాలి. వైశ్యులు ధర్మానుసరణకు కావలసిన ధనమును సముపాదించాలి. శూద్రులు కృషీ వలులై అన్న సమృద్ధిని కలిగించాలి. ఈ బ్రాహ్మలు వేదాధ్యయనంలో ఉండి ధర్మ సూక్ష్మాలను గ్రహించి తమతో పాటు నలుగురికీ తగిన ముక్తి మార్గమును ఉపదేశిస్తూ ఉండాలి. మిగతా వర్ణాల వారు ఆ ధర్మాలను ఆచరిస్తూ ధర్మ మును సంరక్షించుటలో ఆ బ్రాహ్మణులకు సహాయపడాలి. విద్యనర్జించటమె కానీ , సంపాదించటం తెలియని బ్రాహ్మల కుటుంబ పొషణ ఎలా జరగాలి? అందుకోసం ప్రతి వర్ణం వారు ఈ బ్రాహ్మణ వర్ణానికి తగిన విధంగా సహాయపడటం మొదలైంది. ఈ క్రమంలో దక్షిణ అనే సాంప్రదాయం ఏర్పడింది. ఇక సంపాదన గురించి దిగులు లెనప్పుడు ఆ బ్రాహ్మణులు ముక్తి మార్గాన్వేషకులై ఆ మార్గంలో నలుగురినీ నడిపి లోక హితం చేసే వారు.


( ఇక్కడ గ్రహించ వలసిన ప్రథాన విషయం ఒకటుంది. ఈ సాంప్రదాయంలో అన్ని వర్ణాలకూ తగిన న్యాయం జరగలేదని వాదించే వారు నేడు చాలా మంది ఉన్నారు. ఈ వర్ణ విభజన ఆర్థికంగా చూస్తే రాజుకు రాజ్యాధికారం వచ్చింది. వైశ్యునకు ఆర్థిక వ్యవహార చక్షతనిచ్చింది. శుద్రునకు భూమిని ప్రసాదించింది. మరి బ్రాహ్మణునకు ఏమి ఇచ్చింది? విద్యను ఇచ్చింది. కేవలం విద్యను మాత్రమే. ఆ విద్యకు గౌరవం ఇచ్చి మిగతా వారు తమ తమ సంపదలను దానం గా ఇచ్చే వారు. అంటే దానం తీసుకునే స్థితిలోనే బ్రాహ్మడు ఉన్నాడు కానీ. ఇవ్వ గలిగే స్థితి కాదతనిది.

సరే ఇది కాదు గమనించ వలసిన విధానం. మన వ్యవస్థ ఆర్థిక దృష్టితో చేయబడినది కాదు. మోక్షం అనే దృష్టితో చేయబడినది. అందరికీ మోక్షం కలగాలి. అదే మన జీవన విధాన ప్రధాన లక్ష్యం. మోక్షం అంటే ... ఎందరో ఎన్నో చెప్పారు. అది మరో టపాలో చూద్దాము. ఒక్కమాటలో చెప్ప్పాలంటే మోక్షమంటే ఆనందం. నిశ్చల ఆనందం. ఆ ఆనందం అందరికీ సమానంగా ఉండాలి అదే మన హిందూ మత సాంప్రదాయ ప్రధాన లక్ష్యం. మరి అందిందా అందరికీ ఆనందం . నిస్సంకోచంగా అందింది. ధర్మం పాఠించిన ప్రతీ ఒక్కరికీ అందింది. జీవించినంతకాలం ఆనందం వారి జీవితాలలో తాండవించింది. ధర్మం తప్పిన ప్రతీ ఒక్కరికీ అది దూరమయ్యింది. దూరమవుతూనే ఉంది. బ్రాహ్మలు కూడా దీనికతీతులు కారు. )
2. భక్తులు మొక్కులు మొక్కి హుండీలలో కొంత ధనాన్ని వేస్తారు. లేదా ఎటువంటి మొక్కూ లేకపోయినా దేవాలయ నిమిత్తం హుండీలో కానుకలు వేస్తారు. దేవాలయం కోసం అని వేసే విశాల హృదయులు నేడు చాలా తక్కువ. మొక్కుల రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువ. మొక్కుల ద్వారా వచ్చే ఆదయానికి ఆశపడి కొన్ని దేవాలయాల వారి ప్రచారం మరీ ఎక్కువవుతున్నది.

ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ధర్మ కర్తలు, అర్చకుని ఆదాయాన్ని నియంత్రించే మార్గాలను వెతుకుతారు. అతనికి హారతి పళ్లెంలో వసే చిల్లరతో సహా అతను హుండీలోనే వేయాలి అనే నియమంతో అర్చకుని నియమిస్తారు. ఒక వేళ ఏ భక్తుడైనా ఇదేమిటని ప్రశ్నించి నేను అర్చకునికే వేస్తాను అని వాదించింనా లాభం లేదు. అతను వెళ్ల గనే ఆ దక్షిణ హుండీలో పడాలి. ఎండోన్ మెంటు దేవస్థానాలలో ఇది మరీ అధ్వాన్నం. అలా పళ్లెంలో వేసే ధనాన్ని అర్చకుడు దొంగ తనంగా ఎవ్వరి కంటా కనపడకుండా ఇంటికి తీసుకు వెళ్ల్లాలి. ఇలా మొదలైన దొంగతనాలు నగల వరకూ ప్రాకు తాయి కొందరు అర్చకుల విషయంలో. ఇది నిస్సంకోచంగా ఖండించ వలసిన విషయం. ఇందులో ఎవరూ ఆ అర్చకులను వెనకేసుకు రాకూడదు.అసలు దొంగతనం ఎందుకు చేయాలి అర్చకుడు?
తన డబ్బును దేవస్థానం వారు అదో హక్కులా లాక్కుంటుంటే అర్చకుడు చూస్తూ ఊరుకోవలసిందేనా? దీని కేమిటి పరిష్కారం? మీదృష్టిలో ఇది సబబేనా?

గమనిక: ఏ దేవాలయంలోనూ నేను అర్చకుడిని కాదు. సర్వ స్వతంతృడి నైన పురో హితుడిని. పూజ చేయించమని గౌరవంతో ఎవరైనా నా దగ్గరకు వస్తే చేయిస్తాను. లేదా ఇంట్లో కూర్చుంటాను. అర్చకునిగా మొదట కొంతకాలం చేశాను కనుక, తోటి వారి కష్టాలు చూస్తున్నాను గనుక మనసాగక ఇదంతా రాశాను. ఎవరి మనసైనా నొప్పించి ఉంటే మన్నించండి. ఈ విషయంలో మీరు చేయగల సహాయమేమిటో ఆలోచించండి. ఒక్కసారి మీదగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ అర్చకుని జీతం ఎంత? అతని కి వచ్చే ఆదాయం ఎంత? అతనికి వసతి సదుపాయం కల్పించారా? కల్పిస్తే అది ఎలాఉంది? గమనించి వచ్చి మీవ్యాఖ్యను రాయండి.

15, నవంబర్ 2009, ఆదివారం

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు?

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు? అని అప్పుడప్పుడూ పూజల సందర్భంలో కొందరు ప్రశ్నిస్తుంటారు.

వాటికి నేను ఇలా సమాధానం ఇస్తుంటాను. భగవంతుడికి కోపం వస్తుంది. అది అందరి కోపం వంటిది కాదు. మనం తప్పు చేసినప్పుడు ఆయనకు కోపం కలుగుతుంది. అది అమ్మకు తన బిడ్డ ( తప్పు చేసినప్పుడు అతని ) మీద కలిగేటటువంటి కోపం. తన బిడ్డ తప్పుచేయగానే అతను మరోసారి అలా చేయకుండా ఉండేందుకు, అతనిని సక్రమ మార్గంలో నడిపేందుకు ఆ తల్లి తన బిడ్డను ( తెచ్చిపెట్టుకున్న ) కోపంతో దండిస్తుంది. అది నిజమైన కోపం కాదు. తెచ్చిపెట్టుకున్న కోపం. అంటే కోపం వచ్చినట్లుగా అతన్ని భ్రమింపచేసి, తద్వారా అటుల మరల తప్పు చేయకూడదు అని తెలియజేయుటే ఆమె లక్ష్యం. అది ఎక్కువ కాలం ఉండే కోపం కాదు. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా మాయమవుతుంది.

అది ఎప్పుడు మాయమవుతుంది?

ఆ బిడ్డ తల్లి కొట్టగానే అమ్మా! అంటూ ఏడుస్తాడు. తన బిడ్డ నోటి నుండి ఎప్పుడైతే తన కోసమైన ఆర్తి తో కూడిన పిలుపు వినిపిస్తుందో ఆ క్షణాన్నే ఆమె కోపం మాయమై ఆ స్థానంలో ప్రేమపొంగుకొస్తుంది.

” అయ్యో! కన్నా! గట్టిగా తగిలిందా నాన్నా!? ఇంకెప్పుడూ కొట్టనులే. ఎందుకురా నాన్నా నాకు కోపంతెప్పిస్తావు? మరోసారి ఇలాచెయ్యకే మరీ? ”
అంటూ అతన్ని ప్రేమతో లాలించి బాధను మరిపిస్తుంది.

సరిగ్గా అటువంటిదే భగవంతుని కోపం కూడా. మనం తప్పు చేసినప్పుడు, మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి అతను కోపాన్ని నటిస్తాడు. అది శాశ్వతమైన కోపం కాదు. ఎల్ల కాలమూ ఉండ బోదు. ఎప్పుడైతే మనం మన కొచ్చిన బాధలకు/ కష్టాలకు తాళలేక అతని శరణు ఆర్తితో అర్థిస్తామో ఆక్షణమే అతని కోపాన్ని ఉపశమించి, ప్రేమను కురిపిస్తాడు.

మళ్లీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది.

భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేటప్పుడు ఇందరు అవినీతి పరులు ఎలా పుట్టుకు వస్తున్నారు? భగవంతుడు వారందిరినీ సరిదిద్దడేమి?

అలా అర్థించిన ప్రతీ ఒక్కరి కష్టాలు తీరే టట్లైతే ఇందరికి ఇన్ని విధాలైన కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? వారి బాధలు తొలగిపోవేమి? అని


భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేందుకే ఉన్నాడు. తల్లి తన అందరు బిడ్డలనూ ఒకే విధంగా చూస్తుంది. ఒకరిని ఒకలా, వేరొకరిని మరోలా చూడాదు. అందరూ మంచి మార్గంలోనే నడావాలని కోరుకొంటుంది. అందువల్లనే తప్పుచేసిన అందరినీ దండిస్తుంది. కానీ అందరూ తమను దండించింన వెంటనే ఆమెను శరణు వేడరు. ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. ఒకరు ఆమెనుండి దూరంగా ఉండడం ప్రారంభించవచ్చు ( భగవంతుడి వల్ల తమకు జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలాయని అతని పూజించడం మానిన భక్తుల వలే ), వేరొకరు ఆమెను మోసం చేయడానికి అంటే ఆమె సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరోలా ప్రవర్తించడానికి ప్రయత్నించ వచ్చు ( రోజూ గుడిలో పూజలు చేస్తూ, బయటకు రాగానే ఇతరులను మోసంచేస్తూ ఉండే భక్తుల వలే )

కానీ ఏ కొడుకు ఎలా ప్రవర్తించాడో దానికి తగిన విధంగా స్పందిస్తుంది తల్లి. అమ్మా అని అర్థించిన వాడిని అక్కున చేర్చిన ఆ తల్లే , తననుండి దూరమవ్వడానికి యత్నించే కొడుకు విషయంలో , మోసంచెయ్యడానికి యత్నించే కొడుకు విషయంలో వేరు వేరు విధాలు గా స్పందిస్తుంది. ఏది ఏమైనా ఆమె అంతిమ లక్ష్యం తన బిడ్డను సక్రమ మార్గంలో పెట్టడమే. విద్య ఒక్కటే అయినా అది నేర్చుకునే పిల్లవాడిని బట్టి దాన్ని వేరు వేరు విధాలుగా నేర్పుతాడు గురువు.

సరిగ్గ అదే విధంగా భగవంతుడు కూడా మనందరినీ సమానంగానే చూస్తున్నప్పటికీ, మన ఙ్ఞానాన్ని బట్టి మనకు వేరు వేరు విధాలైన పరీక్షలు పెట్టి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంటాడు.

అంటే భగవంతుడు మనల్ని చూసే విధానంలొ ఎటువంటి తేడాను లేదు. ఆ భగవంతుడి చర్యలను మనం స్వీకరించే విధానంలోనే ఉంది ఈ తేడా అంతా. ఒకడుతనకు కించిత్ ఆపద కలుగ గానే భగవంతుడిని శరణు వేడితే, మరొకడు తన తలకు ఎన్ని బొప్పిలు కట్టినా ఆభగవంతుడి మహిమను గుర్తించి, అతని శరణు వేడడానికి త్వరపడడు. అయినప్పటికీ ఆ భగంవతుడు వేరు వేరు పధ్ధతులలో అతనిని అనుగ్రహిస్తాడు.

25, అక్టోబర్ 2009, ఆదివారం

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి



ముందుగా
కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము
( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను. 

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా
- వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.


అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.